12 మార్చి 2018

ఏడు పుస్తకాలు : 6. శ్రీ త్రిపురా రహస్యం

మౌలికంగా, మనకు జీవితం లో రెండు ప్రశ్న లుంటాయి. మనకు ఊహ తెలిసిన మొదట్లో ఈ రెండూ మనకి ఆశ్చర్యాన్ని గొలుపుతాయి. రాను, రానూ జీవించటం మానేసి, బతకటం ఒక అలవాటుగా మారిపోయే మొరటుదనంలో ఈ ప్రశ్నలు మరుగునపడిపోయి, తత్కాల ఘటనలకి తోచిన విధంగా స్పందిస్తూ కాలం గడుపుతాము మనం. ఆ ప్రశ్నలు నేనేమిటి, ఈ ప్రపంచం ఏమిటి. ఇవి ఇట్లా పద రూపంలో కాకపోయినా, మన బాల్యంలో మనలోంచి ప్రకటమయ్యే ఆశ్చర్యం వెనుక ఉండేది ఈ ప్రశ్నలే. మనస్సు స్థూలాన్నే ఆశ్రయిస్తుంది గనుక, అధికులు ప్రపంచానికి తోచిన జవాబులు కల్పించుకొంటూ సాగుతారు. కొద్దిమంది మాత్రం నేను కి అర్థం వెదుకుతారు. నేను అనేది పరిష్కారమైతే ప్రపంచం పరిష్కారమౌతుంది, ప్రతి నేనూ నా నేనుకి నమూనానే గనుక. ఒకటి తెలిస్తే, అన్నీ తెలుస్తాయి. ఈ దృక్పథం రమ్మంటే వచ్చేదీ కాదు, వస్తే పోయేదీ కాదు. ఇట్లా ఈ నేను ఏమిటి అనే ప్రశ్న వచ్చినపుడు లోచూపు మొదలవుతుంది, ఈ దారిలో వెళ్ళినవారు ఏమి చెప్పారో తెలుసుకోవాలనిపిస్తుంది. వారి మాటలనుండి తనకి కావలసిన జవాబులూ, సారమూ తీసుకోవటం జరుగుతుంది. అట్లా నన్ను నేను వెదుక్కొంటున్న క్రమంలో నాకు ఎంతో సహాయం చేసిన పుస్తకాలలో త్రిపురా రహస్యం ఒకటి. 

అప్పుడేమి చదివానో గుర్తులేదు కాని, ఈ పుస్తకం ముద్ర నాపై బలంగానే ఉందనుకొంటాను. త్రిపురాదేవి అంటే మన యదార్థస్వరూపమే. త్రిపురాలు అంటే స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు. భౌతిక దేహం స్థూలమనీ, దానికి కారణమైన మనస్సు సూక్ష్మమనీ, మనస్సుకి కారణమైన మౌలిక సంస్కారాలు కారణమనీ చెబుతారు. కారణ శరీరానికీ ఆధారమై 'నేను ' గా తోచే స్వరూపాన్నే త్రిపురాల యొక్క రహస్యంగా భావించవచ్చును. పరశురాముడు సుమేథునికి చేసిన బోధగా త్రిపురా రహస్యంలో కథ జరుగుతూ ఉంటుంది. కథలో మళ్ళీ అనేక ఉపకథలు వస్తూ ఉంటాయి. నేను అంటే ఏమిటి, మనస్సు స్వభావం ఏమిటి, ప్రపంచం యొక్క ఉనికి ఎటువంటిది వంటి విషయాలు చర్చకు వస్తూ ఉంటాయి దీనిలో.


స్వరూపానుభవం మనకు తరచూ జరుగుతూనే ఉంటుందన్న విషయం ఈ గ్రంథం లోనే చదివిన గుర్తు. ఆలోచనకీ, ఆలోచనకీ నడుమ విరామంలో, మెలకువ నుండి నిద్రలోకీ, నిద్ర నుండి మెలకువలోకీ వచ్చే సందర్భాల్లో, మహా సుఖం, మహా దుఃఖం, మహా భయం సంభవించి మనస్సు నిశ్చేష్టితమయ్యే సమయాల్లోనూ మనం స్వరూపంగా క్షణకాలమో, కొద్దికాలమో ఉంటామని, మళ్ళీ మనస్సు మనని స్థూల ప్రపంచంలోకి తీసుకు వచ్చినపుడు ఆ స్వరూపానుభవం మరుగున పడుతుందనీ చెబుతారు. అట్లానే మనస్సుకి స్వతహాగా రూపం లేదనీ, తాను చూసే దృశ్యాలని అనుసరించి అది ఒక రూపం తీసుకొంటూ ఉంటుందనీ, అట్లానే బయటి ప్రపంచమూ, బయట కాక మనస్సులోనే ఉందనీ చర్చిస్తారు. విరుద్ధంగా కనిపించే ఈ ప్రతిపాదనలకు పై మాటగా చూసేవాడూ (ద్రష్ట), చూడబడేదీ (దృశ్యం) ఒకసారే తోచి, ఒకసారే మాయమయే విషయాలే కాని, వాటికి అస్థిత్వం లేదనీ, చూపు (దృక్కు) మాత్రమే సత్యమనీ, స్వతంత్రమనీ చెబుతారు. ఏ తాత్విక చర్చ చూసినా ఈ పర్యవసానాలకే భిన్న మార్గాల ద్వారా రావటం కనిపిస్తుంది. భారదేశంలోనే కాక, ప్రాక్పశ్చిమ దర్శనాలలో ఎక్కడైనా, ప్రాచీనంలోనే కాక, నవీన దార్శనికుల్ని చదివినా ఇవే మౌలిక విషయాలుగా గోచరిస్తాయి. తిరిగి తిరిగి మనస్సే సమస్య. మనస్సే పరిష్కారం కూడా. లోనికి చూసినా, బయటికి చూసినా.

మనలో ఏదో వత్తిడి ఉండాలి, వేదన ఉండాలి, వెలితీ, వెదుకులాటా ఉండాలి. మంచిగా బతికే ప్రయత్నం, మంచిగా మాత్రమే బతకాలనే మొండితనం ఉన్నపుడు ఈ వత్తిడి కలుగుతుం దనుకొంటాను. అది ఉన్నపుడు వెదుకుతాము. వెదుకు దొరుకుతుంది. తట్టు తెరుచుకొంటుంది. అని జీసస్ చెప్పేది దీని గురించే అనుకొంటాను. నిజానికి నడిపించేది ఆ వెదుకులాటే అయినా, ఆ మార్గంలో నడిచినవారి అవగాహన తెలుసు కొన్నపుడు మన ప్రయాణం వేగవంతమౌతుంది. చదవటం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటే ప్రయాణం వేగవంతం కావటం ఒక్కటే అనుకొంటాను. కానీ, ఎవరి ప్రయాణం వారు చేయవలసిందే. పడుతూ, లేస్తూ తన అనుభవం తను చూడవలసిందే.



 ఈ పుస్తకం శ్రీ రమణాశ్రమం, తిరువణ్ణామలై లో లభిస్తుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి