20 సెప్టెంబర్ 2012

శ్రీ నిసర్గదత్త మహరాజ్ బోధన: సత్యానికి అత్యంత సూటిదారి


శ్రీ నిసర్గదత్త మహరాజ్ (1897-1981) ని, అనేకమంది సత్యాన్వేషులు దర్శించి, సత్యం గురించీ, సాధన గురించీ ప్రశ్నించినపుడు, చాలా తార్కికంగా, వారందరి ప్రశ్నలకూ, చాలా లోతైన జవాబులు ఇచ్చారు. అత్యంత గహనమైన సత్యం గురించి ఇంత ఓర్పుగా, ఇంత సూక్ష్మంగా వివరించిన వారిని మరొకరిని చూడలేదు.

వారి బోధన ఏ మతానికీ, విశ్వాసాలకీ, ఆచారాలకీ సంబంధించినది కాదు. సత్యానికి అత్యంత సూటి మార్గం.

వారి సంభాషణలన్నీ కలిపి 'అయాం దట్ ' పేరిట ఇంగ్లీషులోకి అనువదించారు. సత్యం తెలుసుకోవాలనే శ్రద్ధ అంతగా లేకుండా కేవలం సమాచారం కోసం చదివేవారికి, ఇది ఏమంత ఉపయోగం కాదు. కాని, ఎవరిలోనైతే ఏ మాత్రమైనా జ్వాలామయమైన అన్వేషణ ఉంటుందో, వారికి దీనిలోని మహరాజ్ జవాబులు జీవన జ్వరాన్ని సంపూర్ణంగా నివృత్తిచేసే అమృతవాక్కులలా పనిచేస్తాయి.
 
నాకు అత్యంత ప్రేమాస్పదమైన పుస్తకాలలో ఇది ఒకటి.
ఇది నెట్లో ఉచితంగా లభిస్తోంది. వారి మిగతా పుస్తకాలు కూడా ఇదే సైట్ లో దొరుకుతాయి.

క్రింది లింక్ అనుసరించండి.
http://www.holybooks.com/wp-content/uploads/I-Am-That-by-Sri-Nisargadatta-Maharaj.pdf

19 సెప్టెంబర్ 2012

ఒక్కొక్క కొత్తమనిషి

ఒక్కొక్క కొత్తమనిషి నా జీవితాన్ని దర్శించినప్పుడల్లా
నేను మరికొంత సంపన్నుడినయినట్లూ,
మరికొంత వెలుతురు నాలో పసిపాపలా పారాడుతున్నట్లూ ఉంటుంది
నా స్వప్న ప్రపంచంలో కొత్త రంగులు ప్రవేశిస్తాయి
ఇంతకు ముందు విని ఎరుగని పిట్టలూ, చూడని పూలూ
తెర ఏదో తొలిగినట్లయి దర్శనమిస్తాయి

ఒక్కొక్క కొత్తమనిషి నా కాంతిలోకి ప్రవేశించినపుడల్లా
అపుడే జీవించటాన్ని మొదలుపెట్టినట్లుంటుంది
నా పదాలు కొత్త అర్థాలలోకి మేలుకొంటాయి
ఒక చిరునవ్వు గాలిలో గిరికీలు కొట్టి వచ్చి నా భుజం మీద వాలుతుంది

జీవితమంటే ఇదీ అని ఇప్పటికింకా నిర్వచించుకోలేకపోయాను కానీ
నాముందు మసలే ప్రతి కొత్తమనిషీ దాని రహస్యమేదో చెప్పబోతున్నట్లనిపిస్తుంది

అయినా ఒక విషాదం సాయంత్రపు నీడలాగా నన్ను వెంటాడుతూ ఉంటుంది
ఒక్కొక్క కొత్తమనిషీ చూస్తూ ఉండగానే ఒక ప్రాచీన జ్ఞాపకంలా మారిపోతాడు
అతనిపై నాకై నేను పరిచిన సంతోషపు వెలుతురు పరదా జారిపోయాక
అతనొక చీకటిలో తడుస్తున్న దేవాలయం లా కనిపిస్తాడు

ఊరి నుండి ఊరికి తిరుగుతున్న విశ్రాంతిలేని బాటసారిలా
మనిషి నుండి మనిషికి ప్రయాణిస్తూనే ఉంటాను

బహుశా నేను కూడా ప్రతి మనిషిలోనూ
కొంత వెలుతురునీ, కొంత చీకటినీ ప్రవేశపెట్టి వెళతాననుకొంటా
నేను వెళుతున్నపుడు నా వెనుక ఏవో ప్రపంచాలని మోసుకొంటూ
కొన్ని చూపులు సీతాకోకల్లా అనుసరిస్తున్న చప్పుడేదో వినిపిస్తూ ఉంటుంది

బహుశా, చరమాంకంలో ఒకమనిషి వస్తాడు
జీవితమంటే ఏమిటి అని నేను అడిగినప్పుడు
అతను ఒక అద్దం తెచ్చి నాముందు ఉంచుతాడు
దానిలో నేను జీవితమంతా దర్శించిన వేలమంది మానవులు
దయగా నన్నుచూసి నవ్వుతారు

అప్పుడు
వారినవ్వులతో చెమ్మగిలిన శబ్దమొకటి
తాను వచ్చిన దారిని కనుకొని నిశ్శబ్దంలోకి మరలిపోతుంది


____________________________
నవ్య వీక్లీ ప్రచురణ: 26 సెప్టెంబరు 12

12 సెప్టెంబర్ 2012

'ఆకాశం' అందిన క్షణాలు: మానస చామర్తి


మంచి కవిత్వాన్ని ప్రేమించే ఒక పాఠకురాలు మానస చామర్తి.
ఆమె ఆకాశం కవిత్వాన్ని తన బ్లాగు లో ఇలా పలవరించారు.
ఇటువంటి సున్నితమూ, సునిశితమూ అయిన పరామర్శలే కవుల్ని మరింత సృజన చేసేలా కవిత్వోన్ముఖుల్ని చేస్తాయి.
ఒక మంచి అవార్డుతో సమానంగా కవి భావిస్తున్న వారి మాటల్ని చదవండి.


"పంచమహాభూతాలను తోచినట్లు కలిపి, తోచినట్లు విడదీసే ఆటలలో
నిన్ను నువ్వూ నన్ను నేనూ మరిచిపోవడం కవిత్వం " 

- అని కవిత్వాన్ని నిర్వచించిన వ్యక్తి, అక్షరాలలో మహత్తును నింపి మునుపెరుగని మనోజ్ఞ ప్రపంచాన్ని మనకు పరిచయం చేయని మామూలు కవి ఎందుకవుతాడు? సున్నితమైన భావ పరంపరతో, ఆర్ద్రతతో, ఆశావహ దృక్పథంతో సృజింపబడి, "అపారమైన జీవితానుభవం లేనిదే, జీవించే కవిత్వం వ్రాయలేరు" అన్న ఒక సాహితీవేత్త సత్య ప్రవచనాన్ని పదే పదే గుర్తు చేసిన కవిత్వం, బి.వి.వి ప్రసాద్ గారి "ఆకాశం".

"ఆకాశం" చదివాక, అలతి పదాలతో, లోతైన భావాలను పలికించడం ఇంత తేలికా అని అనిపిస్తే, ఆ తప్పు మీది కాదు. కానీ, జీవితపు లోతులు తెలియకుండా, ఈ కవిలా ప్రగాఢమైన తాత్వికతను నరనరాల్లో నింపుకునే ఆలోచనేదీ లేకుండా, అవే పదాలను ఇటుకలు పేర్చినట్లు పక్కపక్కన పేరిస్తే అదీ కవిత్వమే అవుతుందనుకోవడం మాత్రం అపరాథమే అవుతుంది. అందుకే, ఈ సంపుటిని చదివే ముందు, ప్రసాద్ గారి సాహితీ నేపథ్యం కొంత తెలిసి ఉండటం లాభించే విషయమవుతుంది.

(జనవరి - మార్చి 2012 జయంతి త్రైమాసిక సాహిత్య పత్రికలో బి.వి.వి గారి నుండి సాహిథ్య నేపథ్యాన్ని, "ఆకాశం" రచన వెనుకనున్న ఆలోచనలను రాబట్టిన చర్చలో భాగం - )

"వచన కవిత్వం రాస్తున్నపుడు, హైకూల ద్వారా ఏ ధ్యానానుభవాన్ని, ప్రగాఢమైన నిశ్శబ్దాన్ని, నిర్మల హృదయ స్పందననీ ఇవ్వటానికి ప్రయత్నించానో, దానినే వచన కవిత్వంలో కూడా వ్యక్తీకరించాలనుకొన్నాను. హైకూలకు భిన్నంగా, కొంత భూమికనీ, కొంత వాతావరణాన్నీ సృష్టించటం వచనకవిత్వంలో సాధ్యమౌతుంది గనుక, అలాంటి వాతావరణాన్ని ఆవిష్కరించటానికి ప్రయత్నించాను. కవిత్వం రాస్తున్నపుడు, నాకు నేను కొన్ని నియమాలు లేదా గైడ్‌లైన్స్ పెట్టుకొన్నాను. పాఠకుడికి మరింత తేలికగా కమ్యూనికేట్ కావాలి. పాఠకుడు మొదలుపెడితే చాలు, చివరివరకూ చదివించటానికి తగిన వేగం ఉండాలి. ఏ భావాలు చెప్పినా, ఎప్పుడూ ఉండే సున్నితత్వంతో పాటు, ప్రగాఢమైన దయ అంతర్లీనంగా ఉండాలి. తాత్వికానుభవాన్ని మరింత స్పష్టంగా అందించాలి.  కవిత్వం పూర్తిగా గొంతువిప్పి మాట్లాడుతున్నట్లుండాలి.. ఇలాగ. నేను పెట్టుకొన్న నియమాలన్నిటినీ చాలా వరకూ పాటించగలిగాననే సంతృప్తి కలిగింది.

నా కవిత్వంద్వారా నేను వ్యక్తీకరించిన భావాలపై ఎవరి ప్రభావమూ లేదు. కొంతవరకూ టాగోర్, ఖలీల్‌జిబ్రాన్‌ల ప్రభావం ఉందనుకొంటాను. అయితే ఈ సాంద్రమైన భావాలకు మూలాలు ఎక్కడ ఉన్నాయంటే, నేను చదువుకొన్న తత్వచింతనలో ఉన్నాయనుకొంటాను.  - - బి.వి.వి.ప్రసాద్"

"అడవిలో వికసించి రాలిన అనామక పుష్పంలా
ఎవరూ చూడనప్పుడు ఎగురుతూ వెళ్ళిపోయిన పేరు తెలియని పిట్టలా
నిశ్శబ్దంగా బ్రతికితే ఏమిటి? నిరాడంబరంగా వెళ్ళిపోతే ఏమిటి"             

-అని ఈ తాత్వికుడు ప్రశ్నిస్తాడొక సందర్భంలో. ఆయన ఈ పంక్తులు రాసినంత అలవోకగా, మనము ఆ ప్రశ్నలకు జవాబులు సాధించడం సాధ్యపడుతుందని నేననుకోను. పునఃపరిశీలిస్తే, కవి చెప్పదలచింది కేవలం బ్రతుకులోని నిర్మలత్వం, నిరాడంబరతలోని సౌందర్యం మాత్రమే కాదనీ, వీటికి భిన్నంగా జీవించదలచినవారికి, కనీసం వారి వారి లక్ష్యాల పట్ల, చేరాల్సిన గమ్యాల పట్ల ఉండవలసిన స్పష్టతను గుర్తు చేయడం కూడానేమో అనిపించింది. ప్రశ్నలు తెలిశాయి. జవాబులు జీవితంలో నుండి వెదుక్కోవాలిక, ఏకాంతాన్ని ఆలింగనం చేసుకున్న క్షణాల్లో!

ఈ రోజు ఎక్కడో ఏ పత్రికలోనో లేవయసు పిల్లవాడొకడు జీవితాంతం పోరాటం సాగించలేక మృత్యువు ఒడిని వెదుక్కుంటూ వెళ్ళాడని తెలిసి వగచి ఆ ఆవేశంలో, మనకే అర్థం కాని ఆరాటంతో కవితను రాయడం, మన దుఃఖానికి ఒక వారధిని నిర్మించుకుని ప్రపంచం మీదకు నెట్టడం. అలా కాక, అటువంటి వారెందరి జీవితాలనో పఠించి, ఆలోచనలను మధించి, నిరాశనో నిస్పృహనో కాక ఆశనూ, బ్రతకలాన్న బలీయమైన కాంక్షను కవితలో చూపెట్టదలిస్తే, అది ఈ సంపుటిలోని "వెళ్ళిపోవాలనుందా" కవితలా కదిలించే కవిత్వానికి నిర్వచనమవుతుంది.

"గెలుపు జ్వరం తగిలిన లోకంలో పరాజితుడవై ఆరోగ్యంగా జీవించు
మర్యాదల ప్రాకారాల ఊపిరాడని మనుషుల్ని దయతో పరిహసించు
సమర్థుల్ని ఈతల్లో కొట్టుకుపోనిచ్చి జీవితం గట్టున ప్రశాంతంగా నిలబడి చూపించు
బ్రతికేందుకు వచ్చావు కనుక బలంగా ఒక బ్రతుకు బ్రతికి చూపించు

కనీసం ఈ గంట బ్రతుకు, కనీసం ఈ రోజు బ్రతుకు
మళ్ళీరాని ఈ లోకంలో, ఇక మనకేమీ కాని లోకంలో
మరణిస్తే మరి ఉంటుందో లేదో తెలీని లోకంలో
చావు ధైర్యంతో ఎప్పటికీ బ్రతికి చూపించు, నిజమైన బ్రతుకు బ్రతికి చూపించు"

పైన ఉదహరించిన పాదాలు మాత్రమే కాక, మొత్తం కవితలో నన్ను ఆకర్షించినదేమిటంటే, కవి ఎవ్వరినీ ద్వేషించమనడు, ఎవ్వరినీ నిందించమనడు. కోపమో బాధో కాదు, కన్నీళ్ళు - కుంటి సాకులూ కాదు, బ్రతకడం నీ కర్తవ్యమంటాడు. నీ కోసం నువ్వు కాలపు కౌగిళ్ళలో నుండి మరొక్క రోజును దొంగిలించుకు దొరలా బ్రతికి చూడమంటాడు. శక్తికి మించిన లక్ష్యాలు, పరుగుపందాలుగా మారిన ఎడారి జీవితాల్లో గుర్రప్పందాలు కాసేపైనా మర్చిపోయి, ఇలా సేదతీరమని చెప్పే కవిత్వం ఈ రోజు మనకు చాలా అవసరం. లోలోపలి సామర్థ్యాన్ని మరొక్కసారి తరచి చూసుకోవటానికి, కనీసం వెళ్తున్న దారి మనమెంచుకున్న గమ్యాలకు చేరవేస్తుందో లేదో చూసుకోవడానికైనా మనిషికి విశ్రాంతి అవసరం. మనసుకు సాంత్వన అవసరం. బ్రతకాలన్న కాంక్ష అన్నింటికన్నా బలంగా అవసరం. ఇవేమీ లేని నాడు రేకులుగా విడివడుతున్న స్వాంతసరోజాన్ని ఒక్కటి చేయలేని అసమర్థతతో జీవితాన్ని ఛిద్రం చేసుకునే మనుష్యులను ఆపడమెవ్వరి తరమూ కాబోదు.

ప్రసాద్ గారు వచన కవిత్వంలోనే కాక, హైకూ రచనల్లోనూ నిష్ణాతులు. హైకూల మీద సాధికారంగా అనేకానేక వ్యాసాలు రాసి, దృశ్యాదృశ్యం, పూలు రాలాయి మొదలైన సంపుటాలు కూడా ప్రచురించారు. హైకూ తత్వమంతా మనిషిని ఈ క్షణంలో నిలబెట్టడంలోనే ఉంటుంది. మౌనాన్నీ, ధ్యాన స్థితినీ, దైవత్వం నిండిన అనుభూతులనీ అవి పరిచయం చేస్తాయి. ఆ ప్రక్రియలో ఆరితేరిన వారవడం వల్లా, ఆ సిద్ధాంతాలను మనస్ఫూర్తిగా నమ్మి నిజజీవితంలోనూ ఆచరించదలచిన పట్టుదల వల్లా, "ఆకాశం"లోనూ ఆ ధోరణిని కొనసాగిస్తారు..

"నీటి నడుముపై నీరెండ మునివ్రేళ్ళు చక్కిలిగిలి పెడుతున్న నవ్వులు" 
"చిత్రకారుని రేఖల వెంట తెల్లకాగితంపై తేలుతున్న బొమ్మలా / సర్దుకునే అలల వెంట కొలనులో తేరుకుంటున్న ప్రతిబింబంలా.."  
"ఉదయాస్తమయాల ఒడ్డుల్ని ఒరుసుకుని / ఒక వెలుతురు నది ప్రవహిస్తుంది"

వంటి బలమైన పదచిత్రాలు కవిత్వంలో కనపడ్డప్పుడల్లా ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోయి, ఆ చిత్రాల్లో మమేకమైన అనుభూతికి లోనయ్యాను. ఆ హైకూ క్షణాల్లోని దివ్యత్వాన్ని అనుభవించి కళ్ళు తెరిచాను. "అక్షరాల తీగెల్లో విద్యుత్తై విభ్రాంతినిస్తూ, మాట వెళ్ళిపోయాక మన మధ్య కాంతులీనే మౌనమై మిగులుతూ" పరవశింపజేసిన ఈ కవిత్వం నుండి త్వరగా బయటపడడం అసాధ్యం.

రమణ మహర్షి, జిడ్డు కృష్ణమూర్తి, ఖలీల్ జీబ్రాల్ తదితరుల ప్రభావం తన కవిత్వం పైనా, జీవితం పైనా ఉందని సగర్వంగా చెప్పుకునే ఈ కవి, "ఆకాశం"లోనూ ఆ తాత్వికతను నింపే ప్రయత్నాలు చేశారు. కవితాత్మక ధోరణిలో సాగిపోయే ఈ చింతన, ఆలోచనలు రేకెత్తించడంలో ఎక్కడా విఫలమవలేదు.

"అర్థరాత్రి చంద్రుని చుట్టూ అనేక ధ్యానాలు సృజించవచ్చు
అనేక ప్రార్థనల వెన్నెలలు చంద్రునికి అర్పించవచ్చు
అయినా చంద్రుడు చంద్రుడిలాగే ఉండిపోతాడు"

ఏది ఉందో అదే ఉంటుందనీ, ఈ క్షణాన్ని దొరకబుచ్చుకోవడంలోనే మనిషి మనుగడను రసరమ్యంగా మార్చగల రహస్యమేదో ఇమిడి ఉందనీ చాటే ఈ కవిత్వం మలి పఠనల్లో మరింతగా మనసుల్లో ముద్ర వేసుకుంటుంది.

"ఆకాశం"లోని ప్రతి కవితా, కొన్ని మౌలిక సిద్ధాంతాల చుట్టూ పరిభ్రమిస్తుంది. క్షమ, దయ, ఆర్ద్రత, స్నేహ భావం, మూర్తీభవించిన శాంతం ప్రతి కవితనూ ప్రత్యేకంగా నిలబెడతాయి. కవి తత్వాన్నీ, సాహిత్య నేపథ్యాన్ని, ముందు మాటనూ చదవకుండా, కవిత్వాన్ని కవిత్వంలా కాక పుస్తకంలా చదివే అలవాటున్న పాఠకులకు ఈ సంపుటి పునరుక్తి దోషాలతో నిండి ఉందనే భ్రమ కలుగవచ్చు. కవిత్వమంటే అక్షరమక్షరానా మార్మికత ఉండాలనీ, సంక్లిష్ట పదాడంబరం ప్రతి పుటలోనూ తాండవమాడాలనీ, అలా కానిది కవిత్వం కాదనీ అపోహల్లో బ్రతికే వారికి ఈ పుస్తకం పట్ల చిన్న చూపు కలుగుతుందేమో, - ఆ అభిప్రాయం తప్పనీ, ఒక్కో కవితా చదవగానే నీ హృదిలో నెలకొనే ప్రశాంతతా, కొన్ని సందర్భాల్లో పొడజూపే పశ్చాత్తాపమూ, లోలోపల కరిగిన అహానికి ప్రతీకగా జారే కన్నీరు, ఈ కవిత్వపు విలువని నిశ్చయంగా బలపరుస్తాయనీ చెప్పాలని ఉంది.

సరళతే ఆకాశానికి పట్టుకొమ్మ. ఈ ప్రాథమిక సత్యాన్ని అవగతం చేసుకోవడం, అనిర్వచనీయమైన అనుభూతులను అందుకోవాలనుకునే పాఠకులకు అవసరం. మొత్తం వంద కవితలు ఉన్న ఈ సంపుటిలో ఐదారింటిని మినహాయిస్తే, మిగిలినవన్నీ అగాధమంత లోతైనవీ, ఆకాశమంత విశాలమైన భావ పరిథిని కలవి. 86 మొదలుకుని ఒక పది కవితలు జీవితంలో వివిథ రకాలుగా తనను ప్రభావితం చేసిన పూజ్యులకో, మిత్రులకో కవి ప్రేమతో, సభక్తితో సమర్పించిన నివాళులున్నాయి. అవన్నీ వ్యక్తిగతాలే అయినా కూడా ఎంత బాగున్నాయంటే, వారందరి సత్సంగత్వంతో వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకున్న తీరు చూసి అసూయపడేంతలా..!

సంఘంలోని ఆలోచనాపరులను ఆత్మావలోకనం చేసుకునే దిశగా అడుగులు వేయించగలిగితే, అంతకు మించి కవిత్వం సాధించగల పరమార్థం వేరొకటి ఉంటుందనుకోను. మానవ జీవితాలు వికాసోన్ముఖంగా సాగాలన్న అవగాహనతోనూ, తాత్విక వివేచనతోనూ కవితాత్మను పట్టుకునే ప్రయత్నంలో, బి.వి.వి గారు నూటికి నూరుపాళ్ళూ సఫలీకృతులైనారనడంలో ఎటువంటి సందేహమూ లేదు.

"నిరవధికమైన సమాజంలో నివాతదీపమై కాపడవలసింది మానవత్వమనీ దానికి ఏ రూపంలో కేతనాలెత్తినా అని మంచి కవిత్వమ"నీ ప్రతిపాదించిన ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారి మాటల సాక్షిగా, "ఆకాశం" ఈ తరం తప్పక చదవాల్సిన కవిత్వం. పది మంది చేత చదివించబడవలసిన సున్నితమైన, సమున్నతమైన కవిత్వం.

శతవిధాల ప్రయత్నించినా, అచ్చుతప్పులు కనపడని మంచి ముద్రణతో వెలువడ్డ "ఆకాశం" వెల - 70/- ;
ప్రతులకు - పాలపిట్ట ప్రచురణలు,  హైదరాబాద్, ఫోన్- 040-27678430.
Kinige Link :  http://kinige.com/kbrowse.php?via=author&name=BVV+Prasad&id=125

02 సెప్టెంబర్ 2012

బి.వి.వి.ప్రసాద్ హైకూలు – ఒక పరిచయం: శ్రీనివాస్ వురుపుటూరి


నిన్న పుస్తకం.నెట్ చూస్తున్నపుడు 2011 జనవరిలో బివివి ప్రసాద్ హైకూ పుస్తకాలపై శ్రీనివాస్ వురుపుటూరి రాసిన వ్యాసం కనిపించింది. మనిషికి నిజంగా శాంతినిచ్చేదీ, కాసేపైనా అతన్ని నిజమైన జీవితంతో నింపి, జీవన సంఘర్షణల లోకి మరలా తాజాగా, మరింత వివేకం తో, శక్తితో ప్రవేశించటానికి తనవంతు సహాయం చేసేదీ గుణాత్మక (positive) మైన కవిత్వమని, మనం మాట్లాడే మాట సత్యం, ప్రియం, హితం ల మేలుకలయికగా ఉండటమే అక్షరోపాసన అనీ నమ్మి, రాస్తున్న కవిత్వానికి, ఆ నమ్మకాన్ని రుజువు చేసిన పాఠకుడు ఎవరైనా ఎదురైనపుడల్లా, అతను నాకు, నీ మార్గం మంచిది, నువ్వు నడవాలి, దు:ఖితుల్ని నడిపించాలి నీ కవిత్వం లోకి అని వెన్ను తట్టినట్టు అనిపిస్తుంది. చదివి ఊరుకోకుండా పదిమందికీ పరిచయం చేసిన శ్రీనివాస్ వురుపుటూరిగారి సహృదయానికి నమస్సులు.  పుస్తకం.నెట్ వారి సౌజన్యంతో ఆ వ్యాసం లింక్ నీ, వ్యాసాన్నీ ఇక్కడ పొందుపరుస్తున్నాను. లింక్ ఇక్కడ చూడవచ్చు.

ఓ పది పన్నెండేళ్ళ క్రితం, కవిత్వం చదివి ఇప్పటికన్నా బాగా స్పందించగలిగిన కాలంలో, ఓ రెండు హైకూ సంకలనాలను కొనుక్కున్నాను. కవి పేరు బి.వి.వి.ప్రసాద్. పుస్తకాల పేర్లు: 1) హైకూ 2) పూలు రాలాయి

అంతకు మునుపు, చివరాఖరి ఎనభైలల్లో, హైకూల గురించి చేరా గారు రాయగా చదివినప్పుడూ, అడపాదడపా పెన్నా శివరామకృష్ణ గారివో, గాలి నాసర రెడ్డి గారివో హైకూలను చూసినప్పుడూ, అర్థం కాక – “ఇదేదో కవిత్వంలో పొదుపు ఉద్యమంలా ఉంది” అని అనుకున్నాను చాలాకాలం. ప్రసాద్ గారి హైకూలను చదవటం నాకు కనువిప్పు కలిగించింది.

హైకూ ఒక జపానీయ ఛందో రీతి. పదిహేడు మాత్రలకి పరిమితం. ఆ మాట వినగానే (ఒకోసారి, ఆ మాట వినకపోయినప్పటికీ) హైకూలను మినీ కవితలతోనో, నానీలతోనో పోల్చి కవిత్వపు ఫాషన్‌గా కొట్టిపారేస్తారు కొందరు. కానీ, వీటికీ హైకూలకీ బోలెడంత వ్యత్యాసం! మినీ కవితలూ, నానీలూ చమత్కారికల్లా ఉంటాయి. కోటబిలిటీ కోసం రాసినట్లుంటాయి. హైకూ మాటో? హైకూకి ఓ తాత్త్విక నేపథ్యం ఉంది! కొన్ని వందల ఏళ్ళుగా సాగి వస్తున్న సజీవ సంప్రదాయం, హైకూ. తత్త్వమెరిగిన కవి రాసిన హైకూ పాఠకుడికి ఎంతో విశిష్టమైన అనుభవాన్ని అందిస్తుంది. అందుకు అందమైన సాక్ష్యాలు ఇప్పుడు మీకు పరిచితమవుతున్న ఈ రెండు పుస్తకాలు.

నాకు అర్థమైనంతలో –
హైకూ కవితకి బాగా నప్పే వస్తువులు ప్రకృతీ, పసిపిల్లలున్నూ. హైకూ కవి మనః ప్రవృత్తిలో అపరిమితమైన సంవేదనాశీలతా, సునిశిత పరిశీలనా శక్తీ, ఏకాంత ప్రియత్వమూ, మామూలు వస్తువుల్లో అనుభవాలలో కొత్తదనాన్ని పట్టుకోగల లోచూపూ, ఓ రకమైన నిర్మోహత్వమూ, తనని తాను మరుగు పరచుకోగల వినమ్రతా భాగమై ఉండాలి. శాంతమూ, కరుణా, సున్నితమైన హాస్యమూ – ఇవీ హైకూ కవితకి ప్రధాన రసాలు.

సూచనాప్రాయంగా చెప్పి పాఠకుడిని ఒక ధ్యానస్థితిలోకి, ఒక సున్నితత్వంలోకి తీసుకెళ్ళటంలో ఉంటుంది కవి నేర్పు. అయిదారు పొడి మాటలతోనే ఓ పదచిత్రం గీయాలి, అంతే! ఆ తరువాత పని పాఠకుడికి వదిలేయాలి. “చంద్రుడిని చూపించే వేలు” అని వర్ణించారు హైకూని ఇస్మాయిల్ గారు, దృశ్యాదృశ్యం పుస్తకానికి సమకూర్చిన భూమికలో.

ప్రసాద్ గారి హైకూలని చదివాక కలిగే ఊరటా, ఆహ్లాద భావనా, జాగృతమైనట్లనిపించే సంవేదనాశీలతా అనుభవైకవేద్యాలు. నా ప్రయాణాల్లో, ప్రవాసాల్లో, ఈ హైకూ సంపుటాలను నా దగ్గర ఉంచుకునే వాణ్ణి నేను. ఓ ఒంటరి రాత్రి తటాలున ఏదో ఓ పేజీ తెరిచి, హృదయాన్ని తాకే హైకూలను ఒకటో రెండో చదివి, నిశ్చలత్వాన్నో, సన్నని కదలికనో, ఓ సున్నితమైన స్పందననో అనుభూతిలోకి తెచ్చుకోవటం ఎంత బావుంటుందో!

కవయిత్రి ఓల్గా గారిలా అన్నారట, ప్రసాద్ గారికి రాసిన ఓ ఉత్తరంలో: “వంద భయాలతో, వేయి ఆందోళనలతో సతమతమవుతున్న సందర్భంలో మీ రాలిన పూలు అందుకున్నాను. క్షణంలోనే నా మనస్సు ఒక నిష్కళంకమైన, ప్రసన్నమైన విషాదానుభూతితో నిండిపోయింది” (డేవిడ్ షుల్మన్ గారి  Spring, Heat, Rains: A South Indian Diary నుంచి. ఓల్గా గారి అనుభూతిని వర్ణించేందుకు ఆయన వాడిన పదబంధం: “immaculate, serene sorrow”). తన మిత్రులకి పంచిపెట్టేందుకని ఓ వంద ప్రతులను కొనుక్కున్నారట ఆవిడ.

ఈ రెండు పుస్తకాలకి కవి రాసుకున్న పరిచయ వ్యాసాలు ఎంతో విలువైనవి. హైకూ సంకలనం లోని ‘ప్రకృతీ, జీవితం హైకూల మయమే’ నుంచి కొన్ని వాక్యాలు ఉదహరిస్తాను:
“దృశ్యానికీ, అదృశ్యానికీ; శబ్దానికీ, నిశ్శబ్దానికీ మధ్య సున్నితమైన సరిహద్దు రేఖ హైకూ. హైకూ కవి ఆ సరిహద్దుల్లో సంచరిస్తూ ఉంటాడు. దృశ్యం నుంచి అదృశ్యానికీ, శబ్దం నుంచి నిశ్శబ్దానికీ కవి పాఠకుని తీసుకెళతాడు. ఆ నిశ్శబ్దం శబ్దం కంటే చైతన్యవంతంగానూ, అదృశ్యం దృశ్యం కంటే రసమయంగానూ ఉంటాయి.”
“హైకూ కవికి ప్రపంచమంటే ప్రేమ ఉంటుంది. ఉదాసీనత కూడా ఉంటుంది. వేరువేరు సమయాలలో కాక, రెండూ ఏకకాలంలో ఉంటాయి. ప్రేమ శిఖరాగ్రానికి చేరినపుడు, సాధారణ దృష్టికి అది ఉదాసీనతలా గోచరిస్తుంది. ప్రతి క్షణం, ప్రతి చర్యలో తాను ప్రేమించాల్సింది దేన్నో గుర్తిస్తూనే వుంటాడు. పక్షిని ప్రేమించేవాడు పంజరంలో పెడతాడు. పక్షిని ప్రేమించటం అంటే పక్షి స్వేచ్ఛని ప్రేమించటమే అని తెలిసిన వాడు ఉదాసీనుడిగా కనిపించే మహా ప్రేమికుడవుతాడు.”
“మంచి హైకూ కవి కావటానికి, ఒకరు ముందు కవి కావాలి. తరువాత కవి కాకుండా పోవాలి.”
“హైకూ రాయటం సులువే. మంచి హైకూ రాయటం మరీ సులువు. హైకూ కవి కావటమే కష్టం.”

ముగించే ముందు కొన్ని హైకూలు:

చేయి పట్టుకుంది నిద్రలో,
పాప కలలోకి
ఎలా వెళ్ళను?

నీటి పై

రాలిన పూవుని
ప్రతిబింబం చేరుకుంది

ఎంత అందంగా నవ్విందీ!

పాపాయికి చెప్పాలి
పెద్దయ్యాక

గాలి.

పూలు ఊగాయి
వాటిపై సీతాకోకా

ఆమె వచ్చి అంది.

“చందమామ”
మళ్ళీ నిశ్శబ్దం

చేప దొరికింది

విలవిల్లాడింది
కొలను

రాలిన చినుకు

ఆకాశం వైపు
ఎగిరింది బెంగతో

నక్షత్రాకాశం

మెట్ల దారి
కొండ మీద గుడి వరకూ

ఈ అక్షరాలు చూస్తారు

కానీ ఈ కాగితం చుట్టూ
ఉన్న నిశ్శబ్దాన్నీ, రాత్రినీ…

కలలో ఎవరో అన్నారు

మేలుకో… మేలుకో…
కానీ ఎలాగో చెప్పలేదు!

ఈ రెండు కవితా సంపుటాలూ దొరికితే విశాలాంధ్రలో దొరకవచ్చును. లేదా బి.వి.వి.ప్రసాద్ గారినే నేరుగా సంప్రదించండి. నాకు తెలిసిన చిరునామా:

*     *     *

నా హైకూ సంపుటాలూ, వ్యాసాలూ, నా హైకూలపై ఇస్మాయిల్, సంజీవదేవ్, ఓల్గా గార్ల మాటలూ అన్నీ కలిపి, ఈ బుక్ రూపం లో కినిగే.కాం లో లభిస్తున్నాయి. ఆ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.