15 జనవరి 2024

ధ్యానంతో హైకూ దీపం వెలిగిస్తున్న కవి... బివివి ప్రసాద్




హైకూ చదవడానికి కూడా ఓ అభ్యాసం కావాలి. ఒక హైకుతో సంచలించిన నీ మనస్సును మరో హైకూను తాకే ముందు నిశ్చల సరోవరంలా మార్చుకోవాలి. కదులుతున్న నీళ్ళలో మరో ప్రతిబింబం ఉదయించదు. ఒక అనుభవంతో చలించిన అలలు క్రమంగా నెమ్మదించి నెమ్మదించి అద్దంగా స్థిరపడిన స్థితిలోనే మరో అనుభవాన్ని స్వీకరించడం సాధ్యమవుతుంది.

హైకూ కవి ఒక అనుభూతిని పంచుతాడు. హైకూ పాఠకుడు దాన్ని స్వీకరిస్తాడు. అచ్చమైన హైకూ విషయంలో అదే జరుగుతుంది. రాయడమూ, చదవడమూ ఉండవు. పంచుకోవడం, తీసుకోవడమే ఉంటాయి. ఇంద్రియగతమైన అనుభవాన్ని మరో హృదయానికి కానుకగా ఇచ్చేందుకు హైకూ కవి తనకు ఆ అనుభవాన్ని ప్రసాదించిన దృశ్యాన్ని మాత్రమే మాటల్లో చూపిస్తాడు ఏ అలంకారాలూ, ఊహలూ, గమ్మత్తులూ లేకుండా. అవే మాటల నుంచి అదే దృశ్యాన్ని స్వీకరిస్తాడు పాఠకుడు. అయితే, ఆ దృశ్యం నుంచి విచ్చుకునే అనుభవం మరింత ఉజ్వలంగా, ఉద్విగ్నంగా ఉండవచ్చు. విభిన్నంగానూ ఉండవచ్చు. ప్రకృతిలోని ఒకే దృశ్యాన్ని చూసినప్పుడు ఒక్కొక్కరూ ఒక్కోలా అనుభూతి చెందడం లాంటిదే హైకూను తీసుకోవడం అంటే. ఎవరి హృదయాన్ని బట్టి వారి ప్రయాణం ఉంటుంది. ఈ ప్రయాణం సాగుతున్న కొద్దీ హృదయ మాలిన్యం తొలగిపోతుంది. మార్దవం పెరిగిపోతుంది. ఇంద్రియాలు సునిశితమవుతాయి. చుట్టూ ఉన్న ప్రపంచంతో, ప్రకృతితో సాన్నిహిత్యం పెరుగుతున్న స్థితి సహజమైన మానవీయత వైపు నడిపిస్తుంది. కళలు, ముఖ్యంగా కవిత్వ ఉత్కృష్ట పరమార్థాలలో అదొకటి. సత్యాన్ని తెలుసుకోవడం కాదు, సత్యంలో కలిసిపోవడమే ధ్యానం పరమార్థం అంటుంది జెన్ బౌద్ధం. ఆ ధ్యానానికి దారులు తెరిచే దీపమే హైకూ. జెన్ తాత్వికతకు కవిత్వ ప్రక్రియగా హైకును నిలబెట్టిన మత్సువో బషో, "ప్రకృతితో మమేకమైన మనసుకు కనిపించే ప్రతిదీ పుష్పమే. దానికి వచ్చే ప్రతి కలా వెన్నెలే" అంటాడు.


గత రెండు రాత్రులుగా బివివి ప్రసాద్ హైకూలు చదువుతుంటే కప్ప దుమికిన సరస్సులా కదిలిపోయాను. ఆపై నిశ్చలించాను మరో సంచలనం కోసం. శబ్దం నుంచి నిశ్శబ్దానికి, నిశ్శబ్దం నుంచి శబ్దానికి ప్రయాణం అంతా నిశ్శబ్దంగానే సాగిపోయింది. ఒక కవి రాసిన అన్ని హైకులూ ఈ ఉత్కృష్ట స్థితికి తీసుకుపోలేకపోవచ్చు. ఇంద్రియానుభూతిని భాషలో వెలిగించడంలోని పరిమితులు, నిర్మాణ వైఫల్యాలు ఉండనే ఉంటాయి. ఆ వైఫల్యాలను దాటుకుంటూ పోతున్నప్పుడే వెన్నెలను కలగనే కొన్ని పుష్పాలు హైకూ కవిని వరిస్తాయి.


అయితే, వాటిని తీసుకోవడంలో ఒక్కోసారి చదువరి కూడా విఫలం కావచ్చు. ఒకసారి చదివినప్పుడు తగలని అనుభూతి మరోసారి చదివినిప్పుడు మనల్ని ఉక్కిరిబిక్కిరి చేయవచ్చు. ఏమైనా, హైకూలు రాసే కవి కాలక్రమంలో తాను రాసిన వాటిలో ఎన్నింటినో వదులుకుంటాడు. వాసిగలవేనని నమ్మిన వాటినే రాసులు పోసి పారబోసుకున్నవారెందరో. మూడు వేల హైకూలు రాసి చివరికి మూడింటినే దాచుకుని మిగిలిన వాటిని తగలబెట్టేశాడు Teishitsu' అనే జపనీ కవి. హైకూ కవిగా జీవించడం తెలుస్తున్న కొద్దీ ఈ పరిత్యాగం పెరిగిపోతుంది. ఆ సంగతి బివివి ప్రసాద్కు బాగా తెలుసు. అందుకే అంటాడు: 'హైకూ రాయడం సులువే. మంచి హైకూ రాయడం మరీ సులువు. హైకూ కవిగా జీవించడమే కష్టం.' 'Aesthetic of austerity అనే చైనా, జపాన్ బౌద్ధ భిక్షువుల కవిత్వాభివ్యక్తికి పరాకాష్ఠగా హైకూ ఒక ప్రక్రియగా స్థిరపడింది. కవికీ, అనుభవానికీ మధ్య వెంట్రుకవాసి అంతరం ఉండడానికి కూడా వీల్లేదంటాడు బషో. ఓ కొండ మీద గుడి ఉంటే అక్కడికి వెళ్తాడు బషో ఓసారి. అక్కడ నాచును కప్పుకున్న పెద్ద పెద్ద బండరాళ్ళను చూస్తాడు. అది చూసి ఇలా అంటాడు : ఆహా... ఏమి నిశ్శబ్దం కీచురాళ్ళ గోల కూడా రాళ్ళల్లోకి ఇంకిపోతోంది బషో రాసిన "Narrow Road to the Deep North" అనే యాత్రా రచనలోనిదీ హైకూ. ఆయన కాలంలో వాటిని హైకూ అనే మాట లేదు. బషో వాటిని హెుక్కు అని పిలిచేవారు. 'ప్రయాణమే ఇల్లు' అని చెప్పుకున్న బషో 'హైబన్' అనే మరో సాహిత్య ప్రక్రియకు కూడా ఆద్యుడే. హైబన్ అంటే హైకూ వచనమని అర్థం. ఆయన యాత్రా రచనలని హైబన్ సాహిత్యమని అంటారు. దీన్ని వచన కవిత్వమని కూడా చెప్పవచ్చు. ఐరోపాలో 'vers libre' పుట్టకముందే జపాన్లో ఈ ప్రక్రియ మొదలైంది. హైబన్ రచన సాధారణంగా ఒక హైకూతో ముగుస్తుంది. గాఢమైన అనుభవాన్ని కలిగించిన ఒక దృశ్యాన్ని హైకూగా మలిచేటప్పుడు భాషను ఎంతో పరిమితంగా, క్రమశిక్షణతో వాడాల్సి ఉంటుంది. విభక్తులు, ప్రత్యయాలు వంటి వ్యాకరణ నిర్మాణాలను ప్రయత్నపూర్వకంగా పక్కన పెట్టి పదాలను నాటకీయత ధ్వనించేలా సరళంగా ఉపయోగించాలి. సౌందర్యాత్మక ఆసక్తిని వెలిగించగల కౌశలం మరీ ముఖ్యమని కూడా చెబుతారు హైకూ లాక్షణికులు. ధ్యానం నుంచి ధ్యానాన్ని ప్రేరేపించే ఈ కౌశలాన్ని తెలుగులో బలంగా పట్టుకున్న కవుల్లో నాకు తెలిసినంతవరకు ఇస్మాయిల్, గాలి నాసరరెడ్డి, బివివి ప్రసాద్ ముందువరసలో ఉంటారు.


దూరంగా దీపం 

దానిని కాపాడుతూ 

అంతులేని చీకటి


నిద్రపోయాను

చీకటిలో

చీకటి పడింది


యుగాలు ప్రయాణించి వచ్చింది 

వెలుగు రేఖ 

లేత ఆకును చుంబించడానికి


పాట బాగుంది 

దూరం నుంచి వినిపించడం 

ఇంకా బాగుంది


రెక్కలున్నాయి కదా 

ఎగురు పిట్టా 

నాకు రెండు కళ్ళున్నాయి.


ఓహ్ మిణుగురు 

అటుచూడు

మరొకటి


పర్వతం 

చుట్టూ తిరిగి 

వేయి పర్వతాలు చూసాను


అటూ ఇటూ నడిచి 

ఏమీ తోచక 

పాప నిద్రలోకి నడిచింది.


చెట్టు కూలింది 

మోసుకుపోయారు 

నీడను సైతం


గోడలో పూచిన పూవు 

పరిచయం చేసింది

మా గోడను


అందమైన పూవు 

రాలిపోక ముందే 

వెళ్ళిపోవాలి


గాఢమైన అనుభూతుల్లోకి పదచిత్రాలతో లాక్కుపోయే హైకూలు ఎన్నో ఉన్నాయి బివివి ప్రసాద్ 'హైకూలు' సంకలనంలో. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. గతంలో ఆయన ప్రచురించిన దృశ్యాదృశ్యం, హైకూ, పూలురాలాయి అనే హైకూ సంకలనాలన్నింటినీ కలిపి ఒకటిగా ఈ పుస్తకం తీసుకొచ్చారు ప్రసాద్. బషో హైకూల అనువాదాలు, హైకూ తత్వం అనే వ్యాసాన్ని కూడా ఇందులో చేర్చారు. 2015లో ఈ పుస్తకం రాకముందే ప్రసాద్ రాస్తూ వచ్చిన హైకూలను నేను చదువుతూనే ఉన్నాను. ఈ మధ్య వాబీ సాబీల గురించిన ప్రస్తావన ఎక్కడో ఎదురవడం ఈ సంకలనాన్ని మరోసారి చేతుల్లోకి తీసుకునేలా చేసింది. మంచి కవిత్వాన్ని కొంత కాలం తరువాత మళ్ళీ చదివితే ఆ అనుభవం ఎంత గొప్పగా ఉంటుందో ఇప్పుడు మరోసారి తెలిసింది. అలాగని, ఈ సంకలనంలోనివన్నీ గొప్ప హైకూలనేమీ చెప్పడం లేదు. ఇందులో చాలా గొప్ప హైకూలు ఉన్నాయని మాత్రం కచ్చితంగా చెబుతున్నాను. ఇందులో కొన్ని హైకూలు కాని గొప్ప కవితలున్నాయి.


కవులు

పెద్దయ్యాక పరిచయమయ్యే

బాల్యమిత్రులు


కలలో కనిపించిన

మిత్రుడు

నన్నూ కలగని ఉంటాడా


శిశిర సాయంత్రం

ఎవరో సమీపించి

నా ఏకాంతాన్ని తీసుకువెళ్ళారు


ఇలాంటివి కొన్ని మంచి కవిత్వంగా తీసుకోవచ్చేమో కానీ... హైకూలని అనాల్సిన పని లేదేమో అనిపిస్తుంది. సముద్రంలాగ, నది పన్నిన వలలో.. జాలి దానం చేసిన అనాథ బాలిక వంటివి పోలికలు, క్రియా పదాలు, విశేషణాలు, పనిగట్టుకుని చూపిన సామాజిక స్పృహలు... హైకూ గొడుగు కిందకు తేవడం న్యాయం కాదు. 'పదచిత్రం ఇంద్రియ జ్ఞానాన్ని ప్రేరేపిస్తుంది. లోతైన భావాల్ని ఆవాహన చేసే శక్తి పదచిత్రానికి ఉంది.


కవిత్వానుభవాల్ని పదచిత్రాలు స్ఫురింపచేసినట్లు, బౌద్ధికమైన ఆలోచనలు స్ఫురింపచెయ్యలేవు' అని ఇస్మాయిల్ చెప్పిన మాట హైకూ కవులకే, కాదు, కవులందరికీ వర్తిస్తుంది. ఇస్మాయిల్ గారు అన్నట్లు ప్రసాద్ కవిత్వంలో పూలకన్నా సీతాకోక చిలుకలే ఎక్కువ. వీటితోపాటు కీచురాళ్ళు, నిశ్శబ్దం, వెన్నెల వంటి జెన్ కవి సమయాల పునరుక్తుల నుంచి కూడా ప్రసాద్ విముక్తమై విస్తృతమైతే మరిన్ని గొప్ప హైకూలు రాయగలరు. మనకు తెలుగులో హైకూలు రాసేవాళ్ళే తక్కువ. వారిలోనూ హైకూ రచనను తన మార్గంగా ఎంచుకుని, హైకూ కవిగా జీవించే సాధనలో ఉన్న ప్రసాద్ నుంచే కదా మరిన్ని గొప్ప హైకూలను ఆశించాలి!


ద్రష్ట, దృశ్యమూ, అనుభూతీ ఏకత సాధించినప్పుడే కదా...


పూవూ లేదు

నేను లేను

సౌందర్యం ఆవరించింది


అనే గొప్ప హైకూ ప్రాణం పోసుకుంటుంది. తనను తాను వెతుక్కుంటూ, లోపలి ద్వారాలను తెరుచుకుంటూ ప్రయాణిస్తున్న ప్రసాద్ ను మరెన్నో హైకూ క్షణాలు కరుణిస్తాయని ఆశిద్దాం. వాటిని స్వీకరించే హృదయాలు మరెన్నో పురుడు పోసుకోవాలని కోరుకుందాం.


రచయిత : పసునూరు శ్రీధర్ బాబు

ప్రచురణ : కవిత 78 వ సంచిక





నిరామయ విరామం : డాక్టర్ కాళ్లకూరి శైలజ


ఉన్నట్టుండి తేనె పట్టు తన గదుల తలుపులు తానే తెరిచినట్టు,ఒక లోకం నుంచి మరో లోకానికి వెళ్లిపోతూ శాంతి దేవత అకారణంగా మనవైపు చూసి దయతో నవ్వినట్టు, ఉంటాయి బి.వి.వి. ప్రసాద్ గారి కవిత్వ వాక్యాలు.

వేదాంతం అంటే జీవిత అంత్యస్థితి లో చదువుకునే నాలుగు పడికట్టు రాళ్ల లాంటి పదాలతో మోగే సూత్రావళి కాదు.

ఏ ఏటికా ఏడు, మనసుని తేటపరుచుకుని, జీవితాన్ని మళ్లీమళ్లీ శుభ్రపరచుకునే ఒక ప్రవాహం.

బి.వి.వి. గారి కవిత్వ పుస్తకాలలో/ అలా సాగే దారి...../ ఆ దారిలోని కొత్త పూల చెట్లు..../ వాటి నీడల్లో రాలి పడిన పూలను ఏరుకొచ్చి మెల్లగా వేళ్ళతో అల్లే మాలలూ ఉంటాయి./ సంకల్పం కొరబడినది కాదు సుమా! / సత్సంకల్ప భారం మోస్తున్నదీ కాదు./మరెలా ఉంటాయి?

"వెన్న కరిగి నేయి అయినట్లు, అంధకారం కరిగి కాంతి అయినట్లు” అలా ఉంటాయి.

స్నేహంగా భుజం మీద చేయి వేసి, కళ్ళలో కళ్ళు కలిపి, పాత పాటలో చరణాలు పాడి, చేతులూపుతూ ఆడించే... చిన్ననాటి నేస్తం మాట్లాడినట్టు ఉంటాయి.

“మనం ఒకప్పుడు ఆడిన/ఇసుక తిన్నెల్లో ఇవాళ్ళ ఈ పిల్లలు ఆడుతున్నారు....../ ప్రతిదీ ఉండటం ఎంత బావుందో/ వెళ్ళిపోవటమంత బావుంది./ మనమిక వెళదామా,/ వచ్చినంత సంతోషంగా, నిశ్శబ్దంగా” అంటే, వింటూ ముగ్ధులై నిలబడిపోతాం. ఎక్కడా విరామ చిహ్నాలు అక్కర్లేదు. ప్రశ్నలు బహు తక్కువ.

వేరేవరో అన్న మాటల్ని ఉటంకించడం అస్సలు లేదు,

"కలలో అమ్మ లేక ఏడుస్తున్న ఒడిలోని బిడ్డని, తల్లి తట్టి లేపినట్టు, నిన్నెవరో ఇప్పుడు జీవితంలోకి తట్టి లేపాలి.”

ఈ వాక్యాల దగ్గర బెంగటిల్లి, అంతలోనే బెంగ తీరి, ఎన్ని రోజులు ఆగిపోవాలి! ఎన్ని గంటలు, నిశ్శబ్దంగా ఏ రుచీ లేని మదీ (నదీ) జలాలను కళ్ళు వర్షిస్తాయో! అది అనుభవైకవేద్యమే తప్ప చెప్పేది కాదు.

"పదాలన్నీ ఉత్త శబ్దాలు/ శబ్దాలన్నీ నిశ్శబ్దం పై తేలే అలలు”

"ఆకాశం నుంచి ఆకాశాన్ని తీసివేసినా, ఆకాశమే మిగిలినట్లు,/ నీ నుండి నిన్ను మాటల్లోకి ఒంపినా/ నువ్వు నువ్వుగానే మిగులుతావు”.

పై వాక్యాలను కనీసం ఐదారుగురు సీనియర్ సిటిజన్లకు ఈ అమృత గుళికలు పంపాను. వారంతా కొత్త ఆరోగ్యంతో చిక్కగా నవ్వుతూ, ఆ మెత్తటి సవ్వడిని నా చెవిలో పోసారు.

వాళ్ళకి జీవిత చరమాంకంలో పెన్షన్ సౌకర్యం కన్న ఇలాంటి సహృదయ స్పందనల గీతికలే మరీ మరీ వినిపించాల్సి ఉంది.

"ఆకాశంనుండి అకస్మాత్తుగా చినుకు రాలినట్టు/ కొమ్మనుండి నెమ్మదిగా పూవు రాలినట్టు/దిగుల్లోంచి తటాలున నవ్వు రాలినట్టు నవ్వుల్లోంచి నిశ్శబ్దంగా కన్నీరు రాలినట్టు/ ఉన్నట్టుండి నువ్వు వెళ్ళిపోతే ఏమౌతుంది/ నీ చోటు ఖాళీ చేస్తే ఏమౌతుంది/ నువు చలించటం మానేస్తే ఏమౌతుంది/ వెచ్చని స్పందనని ఏదో చల్లదనం కమ్మితే ఏమౌతుంది”

మనిషికి మరణం అంటే భయం అని చెబితే నేను నమ్మను. / చాలాసార్లు అది విడుదల./ ఒకోసారి ఐచ్ఛికంగా కోరుకునే హాయి. / ఏదేమైనా సంతృప్తితో కొందరు,/ తప్పదని –తప్పించుకోలేమని తెలుసుకున్నాక మెల్లగా సంసిద్ధమయే ఒకానొక దశ వస్తుంది./ అలాకాక ఆందోళన చెందేవారికి పై ప్రశ్నలు తెరతీసి నిజాన్ని చూపిస్తాయి./ ఎలా?/ ఉన్నట్టుండి వెళ్ళిపోయినచోట/ జీవితం నెమ్మదిగా కొత్త చిగుర్లు తొడుగుతుంది./ మొక్క కొత్త తొడిమెలని కలగంటుంది. / చీకటిలో దాగిన ముఖాలని/ తెలియెండ వెదికి మరీ ముద్దాడుతుంది/ ఉన్నట్టుండి నువు విడిచివెళ్ళిన లోతైన ఖాళీని/ జీవితం దయగా మరింత సారంతో నింపుతుంది”

ఈ మాటలు మది నెమ్మదిని అందించి, అలసిన మనసుకు కొబ్బరినీళ్లు ఇచ్చినట్టు, దాహం తీర్చి, బలాన్ని ఇస్తాయి.

ఋతువు మారి,కొత్త సంవత్సరపు లోగిలి లో నిలబడ్డప్పుడు, వెనక్కి, ముందుకీ చూడకుండా, లోపలికి, లోలోపలికి చూసుకునే ఒక 'స్థితి' తాలూకు ఉనికిని తెలియజేసే అద్భుతమైన పుస్తకం.




ఊరికే జీవితమై పుస్తకం పై సమీక్ష

ప్రచురణ : కవిసంధ్య , జూలై-ఆగస్టు, 2023

అంతే..

1

దేనినీ నమ్మకు
అర్థం అనుమానించమని కాదు,
నమ్మటంలానే అనుమానించటం ఒక బలహీనత
ఊరికే ఉండు ఏమీ తెలియనట్టు
నిజంగా తెలియదు నీకైనా, నాకైనా

2
ఊరికే ఉండడం కన్నా 
క్షేమమైన దారేదీ లేదనుకుంటా ఇక్కడ.
క్షేమం అంత అవసరమా అని ప్రశ్న
జవాబు తెలిస్తే 
వెయ్యి లోకాలకి ఒకేసారి తెరుచుకుంటావు

3
స్వేచ్ఛ లోకి వెళ్ళటం ఉన్మాదమా 
అంటావు భయం భయంగా
దయా, స్వేచ్ఛా ఏకమైన లోతుల్లో
ఆరోగ్యముంది నిజంగా అని వింటావు

4
ఎలా వెళ్లాలి అంటావు జాగ్రత్తగా
దూకెయ్యి అని వినవస్తుంది
వెనుదిరుగుతావు 
నీపై జాలి పడుతూ

5
ఈ అద్భుతమైన రాత్రిలానే
రేపటి అద్భుతమైన ఉదయం
నీ కోసం ఎదురుచూస్తుంది
ఎప్పటిలానే నమ్మకంతో, దయగా


రచనాకాలం : 20.9.2023 11.22 రాత్రి 

గాలి తెరల్లోంచి

1
గడ్డిపరక 
గడ్డిపరకలానే నటిస్తుంది చూడు
నక్షత్రం 
నక్షత్రంలా నటించినట్టు
నువు
నీలా నటించడానికి ఏం నొప్పి

2
ఇదంతా 
నువు అనుకునేంత అందమైంది కాదు
అనుకునేంత భయావహం కానట్టే
ఊరికే ఉండు
కాలువలో నిశ్శబ్దంగా పారే నీటిలా

3
బతకాలని చూడకు
పోవాలని కూడా
ఉండటమే చాలు
అంతకన్నా నీ నుండి 
ఈ గాలి కోరేదేమీ లేదనుకుంటాను

4
మనుషుల్నీ
వాళ్ళ భయాల్నీ , ధైర్యాల్నీ  
ప్రేమించు తేలికగా, లేదా పట్టించుకోకు
చిన్నపుడు ఆడి వదిలేసిన బొమ్మలకి
ఏమంత విలువ నివ్వకు 

5
ఈ రాత్రి చూడు 
ఎంత నల్లగా ఉందో
పగటి తెల్లగా కంటే చిక్కగా, చల్లగా
దీని గర్భం లోనైనా 
నువ్వు నువ్వుగా దొరుకుతావా, చూడు

6
ప్రేమించడానికి వచ్చావు
మరే పనికిరాని పనీ పెట్టుకోకు
ఆనందంగానో, గాయపడో
చాతనైనట్టు పాడి, వెళ్ళిపో
పిట్టల్ని చూడు,
వాటి కన్నా జ్ఞానివి కాలేవు

7
ఇదంతా ప్రేమాస్పదం
ఇదంతా నువ్వే గనక
ఇదీ, నువ్వూ కల గనక
పోయేవాటిని ప్రేమించాలి గనక
ఇక వెళ్ళనా, మరి.. 




రచనాకాలం : 21.7.2023 11.18 రాత్రి

 

ఊరికే జీవితమై కవిత్వ సంపుటి కోసం

 'ఊరికే జీవితమై' బివివి ప్రసాద్  కవిత్వసంపుటి 

ఈ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చును. 

ఆసక్తిగల మిత్రులు ప్రయత్నించగలరు.

శుభాకాంక్షలతో.. 

లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

08 ఏప్రిల్ 2023

ఊరికే కవిత్వమై.. ముక్కామల చక్రధర్





"తెలియటం నుండి తెలియకపోవటంలోకి దూకాలి
ఏదో ఒకటి కావటం నుండి ఏదీ కాకపోవటంలోకి "

అవును... ఒడ్డున కూర్చుని నదిలో స్నానమాడుతున్న వారిని కాదు చూడడమంటే. నది లోతులు కొలిచేందుకు అందులోకి దూకాలి. అదే జీవితమంటే. అలాంటి జీవితమే కావాలంటూ ఊరికే జీవితమై బతకాలి అంటున్నాడు ఈ శుద్ధ కవిత్వ ప్రేమికుడు బి.వి.వి.ప్రసాద్‌. నా అక్షరాలు వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు అన్న కవి తిలక్‌ పుట్టిన ఊరు తణుకు నుంచి వచ్చాడు ఈ కవి బి.వి.వి. ప్రసాద్‌. మహాకవులు, మంచి కవులు పుట్టిన ఊరు నుంచి కనీసం ఒక మంచి కవైనా రావడం తెలుగు సాహిత్య "ఊరు వారసత్వం". అలా తిలక్‌ కు వారసుడు ఈ బి.వి.వి. ప్రసాద్‌ అనిపించింది అతని ఊరికే జీవితమై కొత్త సంకలనం చదువుతూంటే...

"జీవితంలోకి దూకకుండా ఉత్త జీవితాన్ని చూసావా" అని నిలదీస్తున్నాడు ఈ కవి సమస్తలోకాన్ని. బహుశా అలా జీవితంలోకి చూడలేని కాలం ప్రారంభమై చాలా కాలమే అయ్యింది. నిజానికి ఈ బిజీ బతుకుల్లో ఎలాగోలా జీవించడం తప్ప జీవితాన్ని ఉత్త జీవితంలా చూసిన వాళ్లు కానరాని లోకం ఇది. అలా చూస్తే... చూడగలిగితే ఇక ఏ జీవితమూ మిగలకపోవచ్చు. ఆ ఏరుకలో ఉన్నారు కనుకనే మానవులంతా పక్క వారి జీవితాలనే కాదు.... తమ జీవితాలను చూసుకునే స్ధితిలో లేకుండా పోయారు. అలా చూడండర్రా అంటున్నాడు ఈ అమాయకపు కవి. చూడలేరని తెలిసి కూడా.

ప్రపంచ సాహిత్యాన్ని పరికిస్తే కవులంతా అమాయకులే. అదేంటో తెలుగు నీళ్లో.... అతి తెలివితేటలో చెప్పలేం కాని తెలుగు కవులు మాత్రం మాయకులు. కవిత్వం కాని దాన్ని కవిత్వంగా చెలామణి చేసేస్తారు. లేదూ చేయిస్తారు. అలా తెలుగు కవిత్వంలో అకవుల సంఖ్య నానాటికి పెరిగిపోయింది. నిత్యం పెరిగిపోతోంది కూడా. మనం రోజూ చూసే మనిషే... నిత్యం మనకు ఎక్కడో ఒకచోట తారసపడే వారే ఉగాది పండుగ రాగానే కవుల్లా కనిపిస్తారు. వీరిని పోల్చుకుందుకు గతంలో వారి చేతిలో కవిలికట్టలు ఉండేవి. ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్లే కనుక ఎవరు కవో, ఎవరు సాధారణ మానవుడో తెలుసుకోవడం చాలా కష్టం.

తామరతంపగా పెరిగిపోతున్న కవుల సంఖ్యలో శుద్ధ కవిత్వాన్ని వెతుక్కోవడం, ఆ కవిత్వాన్ని ఆస్వాదించడం ఈ రోజుల్లో చాలా కష్టం. అందుకే ఎవరైనా నేను కవిని అంటే భయపడే రోజులు వచ్చాయి. అలా అన్న వారి నుంచి కాసింత దూరం జరగడం కవిత్వం చేసుకున్న ప్రారబ్దం. కానీ, ఈ కవి బి.వి.వి. ప్రసాద్‌ కవిత్వం అందుకు మినహాయింపే కాదు కవిత్వాభిమానులకు ఓ ఊరడింపు. విద్యార్ధి దశ నుంచే కవిత్వాన్ని ప్రేమించిన బి.వి.వి. ప్రసాద్‌ కవిత్వం కోసం చిక్కటి వెలుగు నీడలు చూశాడు. తన వెంట తరిమిన వియోగాల్ని అనుభవించాడు. అందుకేనేమో ఊరికే కవిత్వమై మిగిలాడేమో.

" అనేక క్షణాలుగా కనపడే ఒకే ఒక్క క్షణం ఇది
దానిని అనుభవిస్తున్నట్లు ఉంటుంది గానీ
అది నిన్నూ, నన్నూ, లోకాన్ని
అనుభవిస్తూ, పలవరిస్తూ చలిస్తోంది "

అంటాడు. ఇదిగో ఇలా చలించడం కోసమే మహాకవి శ్రీశ్రీ ఒక్కడై శ్రుక్కిన రోజులు అనుభవించాడు. అందుకే చలం కూడా అనుభవించి పలవరించమన్నాడు. ఎవరి జీవితాలను వారు పుటం పెట్టుకుంటే తప్ప ఊరికే జీవితమై బతకలేమని తెలుస్తుంది. బహుశా తన ఇంటి పక్కనే ఉన్న గోదావరి అలలు అలలుగా తనలోకి ప్రవేశించడం.... రోజుకు పది గంటలకు పైగా కోళ్ల మందుల వాసన కొట్లో కూర్చునే ప్రసాద్‌ కు జీవితపు మట్టి వాసన తెలియడమే ఇదిగో ఇలా కవిత్వమై పరిమళించింది.

నా ఇష్ట కవి ఇస్మాయిల్‌ వెళ్లిపోయిన తర్వాత ఆ బెంగను గాలి నాసరరెడ్డి కాసింత తీర్చాడు. కాని తర్వాత కాలంలో ఉద్యోగమో, జీవికో తీసుకొచ్చిన కష్టాల కారణంగా కవిత్వ "గాలి" తగ్గింది. ఇస్మాయిల్ కవిత్వాన్ని పట్టుకున్నామన్న కవులు తెలుగులో చాలా మందే ఉన్నారు. కాని చాలాకాలం తర్వాత ఆ కవిత్వ ఆత్మను రుచి చూపించిన కవి బహుశా బి.వి.వి. ప్రసాద్ మాత్రమే. లేత అరటాకు చివర మెరుస్తున్న మంచు బిందువులా ఉంటుంది ప్రసాద్‌ కవిత్వం. " ఎన్ని రాస్తే సీతాకోక ఎగిరిపోయిన ఖాళీలవుతాయి" ఇదే కదా కవిత్వమంటే. ప్రసాద్‌కి కవిత్వ రహస్యం తెలుసు. ముఖ్యంగా పదాలను ఎంత వొద్దికగా రాయాలో, వాడాలో తెలుసు. చలం అన్నట్లు ఎకానమీ ఆఫ్‌ థాట్స్ కంటే ఎకానమీ ఆఫ్‌ వర్డ్స్ లేకపోవడం దేశభక్తి కంటే హీనమైన పాపమనే ఎరుక బి.వి.వి.లో శుద్ధ కవిత్వమంత ఉంది. పెదాల తడి తాను కాల్చే సిగరెట్ కు ఎక్కడ అతిగా అంటుకుంటుందో అనే భయమే ప్రసాద్‌ కవిత్వంలో అడుగడుగునా కనిపిస్తుంది. కవిత్వ ప్రేమికులకు ఈ ఏడాది దొరికిన ఓ మంచి కవిత్వ సంకలనం ఊరికే జీవితమై.....

( ఆదివారం ఖమ్మంలో కవి బి.వి.వి.ప్రసాద్ కవిత్వ సంకలనం ఊరికే జీవితమై ఆవిష్కరణ సందర్భంగా)

- ముక్కామల చక్రధర్‌. 99120 19929

ప్రచురణ: చక్రవాకం, విశాలాంధ్ర 8.4.2023